మా భూములు మాకే వదిలేయండి.. గోపిశెట్టి రైతుల నిరసన..
మా భూములు మాకే వదిలేయండి.. గోపిశెట్టి రైతుల నిరసన..
పెప్పర్ కంపెనీ ఏర్పాటు కోసం మా పంట భూములను లాక్కోవద్దండి.. రైతుల ఆవేదన
అన్నమయ్య జిల్లా,పుంగనూరు మండలం గోపిశెట్టి రైతులు నేడు తాసిల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కు దిగారు. ఈ సందర్భంగా వాల్మీకి రాష్ట్ర నాయకులు సుకుమార్ బాబు ఆధ్వర్యంలో రైతులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వంలో పుంగనూరులో పెప్పర్ ఎలక్ట్రానిక్ బస్సుల ఫ్యాక్టరీకి మేలుందొడ్డి,ఆరడి గుంట, సింగిరి గుంట వద్దగల డికెటి భూములు సుమారు 750 ఎకరాలు కేటాయించడం జరిగిందని, అయితే గోపిశెట్టిపల్లి వద్ద సుమారు 170 ఎకరాలు రైతులు టమోటా,వరి, కర్బూజా వంటి పచ్చని పంట పొలాల సాగులో వ్యవసాయం చేసుకుంటున్నామని ప్రతి రైతు తన భూమిలో సొంతంగా బోర్లు వేసుకొని కష్టపడి పంటలు పండిస్తున్నామని,మా భూములు మాకే వదిలేయాలని గత ప్రభుత్వంలో భూములు లాక్కోవడానికి వత్తిడి తేవడంతో మా ఊరు రైతులందరూ తిరగబడి అన్యాయాన్ని ప్రజలందరికీ తెలియజేయడంతో భూముల సర్వే నిలిపేసారని అయితే ఇప్పుడు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో పుంగనూరు తాసిల్దార్ తిరిగి మా భూములను పెప్పర్ ఎలక్ట్రిక్ బస్సు ఫ్యాక్టరీకి ఇవ్వడానికి మా గ్రామ రైతులను అడగడం జరిగిందని,నేడు తాసిల్దార్ రాము కి మేము పంటలు పండించే భూమిని ఇవ్వడానికి ఒప్పుకోమని ఈ సంవత్సరానికి రెండు పంటలు పండించే సాగు భూమి పంటలే మాకు జీవన ఆధారమని దీనిపై ఆధారపడి దాదాపు 150 కుటుంబాల పిల్లలు,పెద్దలు అందరూ బతుకుతున్నామని మా గోపిశెట్టి వ్యవసాయ భూమిని వదిలి సాగు లేని భూములను ఫ్యాక్టరీకి కేటాయించాలని వినతి పత్రం అందించడం జరిగిందన్నారు.మా గోపిశెట్టిపల్లి చుట్టూ ఉన్న భూమిని వదిలి వెనుక నిరుపయోగంగా ఉన్న డీకేటి భూములను ఫ్యాక్టరీకి తీసుకునేలా చర్యలు చేపట్టాలని అధికారులకు కోరారు.ఇది ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో చుట్టుపక్కన అన్ని గ్రామాల ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి సంసిద్ధమని అన్నారు. నిరసన కార్యక్రమంలో గోపిశెట్టిపల్లి రైతులు పాల్గొన్నారు.