మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆరోగ్యం విషమం వెంటిలేటర్పై చికిత్స.. బుధవారం న్యూరో అసెస్మెంట్
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆరోగ్యం విషమం వెంటిలేటర్పై చికిత్స.. బుధవారం న్యూరో అసెస్మెంట్
హైదరాబాద్: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి (54) ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రి అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ యూనిట్లో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు.
ఆసుపత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ జి. విజయ్కుమార్ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం, సుదర్శన్రెడ్డి తొలుత వరంగల్లోని రోహిణి ఆసుపత్రిలో చేరారు. ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టడం (పల్మనరీ ఎంబోలిజం) కారణంగా రక్తపోటు తీవ్రంగా పడిపోవడంతో గుండె స్పందన నిలిచిపోయింది. దాదాపు 45 నిమిషాలపాటు సీపీఆర్, ఏసీఎల్ఎస్ విధానాల్లో అత్యవసర చికిత్స అందించి గుండె స్పందనను వైద్యులు పునరుద్ధరించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం యశోద ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం క్రిటికల్ కేర్, పల్మనాలజీ, కార్డియాలజీ, న్యూరాలజీ నిపుణుల బృందం చికిత్స అందిస్తోంది. వెంటిలేటర్ స్వల్ప మద్దతుతో శ్వాసక్రియ, రక్తపోటు కొనసాగుతున్నప్పటికీ, గుండె స్పందన సుదీర్ఘకాలం నిలిచిపోవడం వల్ల నాడీ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నట్లు వైద్యులు వెల్లడించారు.
ఈఈజీ, ఎంఆర్ఐ, టీసీడీ పరీక్షల్లో మెదడుకు ఆక్సిజన్ అందక నష్టం జరిగినట్లు గుర్తించినట్లు తెలిపారు. శబ్దం, స్పర్శకు ఆయన ఎలాంటి స్పందన చూపడం లేదని పేర్కొన్నారు. వైద్య ప్రమాణాల ప్రకారం బుధవారం 72 గంటల న్యూరో అసెస్మెంట్ నిర్వహించి మెదడు పనితీరును మరోసారి అంచనా వేయనున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నాయి.