మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసిన పుంగనూరు టీడీపీ ఇన్చార్జ్ వై. మధుసూదన్ నాయుడు...
అన్నమయ్య జిల్లా.
పుంగనూరు.
పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నూతన ఇన్చార్జ్గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన వై. మధుసూదన్ నాయుడు సోమవారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఇరువురు నేతలు కొద్దిసేపు ఆత్మీయంగా సమావేశమై పలు రాజకీయ, సామాజిక అంశాలపై చర్చించినట్లు సమాచారం. ముఖ్యంగా పుంగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలోపేతం, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేయడం, స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేయడం వంటి అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
పార్టీ అధిష్ఠానం తనపై ఉంచిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ కార్యకర్తలు, నాయకులను సమన్వయం చేసుకుని పార్టీని నియోజకవర్గంలో మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానని మధుసూదన్ నాయుడు పేర్కొన్నట్లు సమాచారం.
మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని కలవడం ద్వారా ఆయన నుంచి రాజకీయ అనుభవం, సూచనలు పొందినట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ భేటీ పుంగనూరు టీడీపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని కలిగించింది.