ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 71 ఫిర్యాదులు స్వీకరణ
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 71 ఫిర్యాదులు స్వీకరణ
భూకబ్జాలు, వడ్డీ వేధింపులపై కఠిన చర్యలు: ఎస్పీ ధీరజ్ కునుబిల్లి
అన్నమయ్య జిల్లా | మదనపల్లె | Ntoday News
మదనపల్లెలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వివిధ సమస్యలపై బాధితులు తమ ఫిర్యాదులను ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు.
ఈ కార్యక్రమంలో మొత్తం 71 ఫిర్యాదులు అందాయి. వీటిలో భూ వివాదాలకు సంబంధించి 30, ఆర్థిక వివాదాలు 10, ఘర్షణలు/న్యూసెన్స్కు సంబంధించి 10, మోసం/సైబర్ సంబంధిత 7, కుటుంబ వివాదాలు 6, ఇతర సమస్యలు 5, పరిపాలనకు సంబంధించిన 3 ఫిర్యాదులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఫిర్యాదులను స్వీకరించిన ఎస్పీ ధీరజ్ కునుబిల్లి.. బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భూకబ్జాలు, వడ్డీ వేధింపులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు.
బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించిన ఎస్పీ.. సమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యాన్ని ఏమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి, చట్టపరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఫిర్యాదులపై విచారణను వేగంగా పూర్తి చేసి, సంబంధిత నివేదికలను జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయానికి వెంటనే పంపాలని అధికారులకు ఎస్పీ సూచించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజలకు న్యాయం అందేలా పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.