నంద్యాల: రైతుల సమస్యలపై వైసీపీ చలో కలెక్టరేట్..
నంద్యాల: రైతుల సమస్యలపై వైసీపీ చలో కలెక్టరేట్.. సాగు, తాగునీటి కోసం భారీ ఆందోళన
నంద్యాల జిల్లా కలెక్టరేట్ రైతుల నినాదాలతో దద్దరిల్లింది. సాగు, తాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన "చలో కలెక్టరేట్" కార్యక్రమం భారీగా జరిగింది. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి నేతృత్వంలో రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు, వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
"రైతులకు నీరు ఇవ్వాలి.. ప్రజలకు తాగునీరు అందించాలి" అంటూ నినాదాలు చేస్తూ కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు ఉన్నప్పటికీ రాయలసీమ ప్రాంత రైతులకు సాగునీరు విడుదల చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆందోళనకారులు ఆరోపించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ రాజకుమారికి రైతుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. స్పందించిన కలెక్టర్ రెండు, మూడు రోజుల్లో నీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి మాట్లాడుతూ.. వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు ఎండిపోతున్నాయని, చెరువులు, కుంటలు నీరు లేక వెలవెలబోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీశైలం జలాశయంలో నీరు ఉన్నప్పటికీ రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను చూపడం లేదని ఆరోపించారు. నీరు అందించకపోతే రైతుల పక్షాన మరింత ఉద్ధృతంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
వర్షాభావ పరిస్థితుల్లో రైతులకు పంటల భరోసా కల్పించడం లేదని, బీమా సౌకర్యం అమలు చేయడం లేదని విమర్శించారు. ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచిస్తున్న అధికారులు, వాటికి అవసరమైన నీటి సౌకర్యం కల్పించాల్సిన బాధ్యతను కూడా తీసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇసాక్ భాషా, మాజీ ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, వైసీపీ రాష్ట్ర సీఈసీ సభ్యుడు పీపీ నాగిరెడ్డి, రైతు సంఘాల ప్రతినిధులు, వైసీపీ నాయకులు, నంద్యాల, గోస్పాడు మండలాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.
రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించే వరకు పోరాటం కొనసాగిస్తామని వైసీపీ నాయకులు స్పష్టం చేశారు.