తిరువూరులో విద్యార్థినులకు డ్రెస్ మెటీరియల్, పాఠశాలకు మైక్ సెట్ వితరణ
(ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరు)
విద్యార్థుల చదువుకు అవసరమైన సౌకర్యాల కల్పనలో ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని తిరువూరు మాజీ జెడ్పీటీసీ సభ్యులు గద్దె రమణ అన్నారు. తన తల్లి గద్దె అనసూర్య జ్ఞాపకార్థం తిరువూరులోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో విద్యార్థినులకు డ్రెస్ మెటీరియల్తో పాటు పాఠశాల అవసరాల కోసం మైక్ సెట్ను ఆయన విరాళంగా అందజేశారు.
ఈ సందర్భంగా గద్దె రమణ మాట్లాడుతూ విద్యార్థులే సమాజ భవిష్యత్ తరాలని, ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రతి విద్యార్థి మంచి విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండటం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.
విద్యార్థులకు చిన్న సహాయం చేసినా అది వారి భవిష్యత్తుకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో డ్రెస్ మెటీరియల్, మైక్ సెట్ను అందించినట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
పిల్లల భవిష్యత్తు కోసం చేసే సేవే నిజమైన సేవ అని గద్దె రమణ పేర్కొన్నారు. విద్యార్థుల విద్యాభివృద్ధి, పాఠశాలల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
విద్యార్థినులకు డ్రెస్ మెటీరియల్ అందించడంతో పాటు పాఠశాలకు మైక్ సెట్ అందజేసిన గద్దె రమణకు పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.