మార్కాపురం : మూడు దశాబ్దాల కల సాకారం.. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు జాతికి అంకితం
ప్రకాశం జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన వెలిగొండ ప్రాజెక్టుకు ప్రభుత్వం **“పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు”**గా నామకరణం చేసి ప్రారంభించనుంది. ఇంతకీ ఈ ప్రాజెక్టుకు పేరు పెట్టిన పూల సుబ్బయ్య ఎవరు..? ఆయన చేసిన పోరాటం ఏమిటి..?
పూల సుబ్బయ్య కమ్యూనిస్టు నాయకుడు. ఆయన ఎర్రగొండ్లపాలెం నియోజకవర్గం నుంచి రెండుసార్లు, మార్కాపురం నియోజకవర్గం నుంచి ఒకసారి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు.
పశ్చిమ ప్రకాశం, నెల్లూరు ప్రాంతాలు తరచూ కరువుతో అల్లాడేవి. తాగునీటి సమస్యతో పాటు ఫ్లోరైడ్ ప్రభావం ప్రజలను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేసేది. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం కృష్ణా జలాలను ఈ ప్రాంతాలకు తరలించాలని పూల సుబ్బయ్య పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టారు.
ఆయన చేసిన పోరాటాల ఫలితంగానే వెలిగొండ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం జిల్లా కరువు ప్రాంతాలతో పాటు నెల్లూరు జిల్లా ఉదయగిరి, వైఎస్సార్ జిల్లా బద్వేలు ప్రాంతాల్లోని సుమారు 30 మండలాలకు చెందిన 15 లక్షల మందికి తాగునీటి సౌకర్యం అందుబాటులోకి రానుంది.
1988లో వెలిగొండ ప్రాజెక్టు రూపకల్పనకు అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఆదేశాలు ఇచ్చారు. అనంతరం 1999లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయి. ఈ ప్రాజెక్టు కోసం జీవితాంతం పోరాడిన పూల సుబ్బయ్య పేరును పెట్టాలని ప్రజల నుంచి డిమాండ్లు రావడంతో 2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి “పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు”గా నామకరణం చేసి మరోసారి శంకుస్థాపన చేశారు.
అనేక ఆటంకాలు, ఆలస్యాలను అధిగమించి దాదాపు మూడు దశాబ్దాల తర్వాత వెలిగొండ ప్రాజెక్టు పూర్తయి జాతికి అంకితం కానుంది.
దేశంలోని ప్రముఖుల పేర్లతో ఉన్న భారీ నీటి ప్రాజెక్టుల సరసన తొలిసారిగా ఒక పెద్ద నీటి ప్రాజెక్టుకు పూల సుబ్బయ్య పేరు రావడం ఆయన సేవలకు గుర్తింపుగా పలువురు అభివర్ణిస్తున్నారు. ముఖ్యంగా కాపు, తెలగ, బలిజ వర్గాలతో పాటు ఈ ప్రాంత ప్రజలు దీనిని గర్వకారణంగా భావిస్తున్నారు.
మూడు దశాబ్దాల కల నేడు సాకారమైంది.
ప్రజల దాహార్తి తీర్చాలన్న పూల సుబ్బయ్య ఆశయం నెరవేరింది.