మేడూరులో 1116 శివలింగాల ఆలయంలో వైభవంగా అన్నాభిషేకం
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం మేడూరు గ్రామంలోని కాత్యాయనీ సమేత జీవన ముక్తేశ్వర స్వామి వారి ఆలయం (1116 శివలింగాల ఆలయం)లో సోమవారం పర్వదినాన్ని పురస్కరించుకుని అన్నాభిషేక మహోత్సవం వైభవంగా నిర్వహించారు.
ఆలయ అర్చకులు ఇంద్రగంటి దుర్గాప్రసాద్ శర్మ వేదమంత్రాల నడుమ జీవన ముక్తేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి, అనంతరం శివలింగానికి ఘనంగా అన్నాభిషేకం చేశారు. ముందుగా గణపతి పూజ నిర్వహించి, స్వామి, అమ్మవారితో పాటు ఆలయ ప్రాంగణంలోని ఇతర దేవతా విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు.
శివలింగానికి అన్నాభిషేకం చేయడం వల్ల లోకంలో ఆహార సమృద్ధి కలిగి, పంటలు బాగా పండుతాయని ఆలయ అర్చకులు తెలిపారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు.