మధిర మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.62 కోట్ల నిధులు..
మధిర మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.62 కోట్ల నిధులు.. మారనున్న పట్టణ స్వరూపం
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చొరవతో మౌలిక వసతుల కల్పనకు భారీ ప్రతిపాదనలు
వార్డుల వారీగా సమస్యల గుర్తింపు.. పనులపై క్షేత్రస్థాయి పరిశీలన
మధిర, ఖమ్మం జిల్లా:
మధిర మున్సిపాలిటీ అభివృద్ధికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రత్యేక చొరవ తీసుకున్నారు. తన నియోజకవర్గమైన మధిర పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మౌలిక వసతుల కల్పనకు రూ.62 కోట్ల భారీ నిధుల ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.
పట్టణంలోని వివిధ వార్డుల్లో మెటల్ రోడ్ల నిర్మాణానికి రూ.17 కోట్లు, సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.40 కోట్లు, సీసీ డ్రైన్లు, ఆర్సీసీ కల్వర్టులు, వైకుంఠధామం అభివృద్ధికి రూ.5 కోట్లు కేటాయించేలా ప్రతిపాదనలు రూపొందించారు. ఈ పనులకు సంబంధించిన సమగ్ర నివేదికలను త్వరితగతిన పంపించాలని పురపాలక శాఖ జాయింట్ డైరెక్టర్ కే. ఫల్గుణ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు.
నిధుల ప్రక్రియ వేగవంతం కావడంతో మధిర మున్సిపల్ చైర్పర్సన్ సామినేని సుజాత ఆధ్వర్యంలో అభివృద్ధి కమిటీ సభ్యులు మంగళవారం పట్టణంలోని 4వ వార్డులో పర్యటించారు. వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని, నిర్మించాల్సిన సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా చైర్పర్సన్ సామినేని సుజాత మాట్లాడుతూ మధిర పట్టణ అభివృద్ధికి రూ.62 కోట్ల నిధుల ప్రతిపాదనలు తీసుకురావడంలో చొరవ చూపిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలిపారు. ప్రతి వార్డులో డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు, నాణ్యమైన రోడ్ల నిర్మాణంతో పట్టణ రూపురేఖలు మారేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
అధికారుల నివేదికల ప్రక్రియ పూర్తయిన వెంటనే అభివృద్ధి పనులను ప్రారంభించి మధిరను ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శామ్యూల్ పాల్, వైస్ చైర్మన్ కోన ధని కుమార్, అభివృద్ధి కమిటీ సభ్యులు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం, వేమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు తలుపుల వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ జిల్లా నాయకుడు మిరియాల వెంకటరమణ గుప్తా, పలువురు కాంగ్రెస్, టీడీపీ నాయకులు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.