మధిర: తెరవెనుక స్క్రిప్టులు కాదు..అభివృద్ధిపై బహిరంగ చర్చకు రండి
మధిర: తెరవెనుక స్క్రిప్టులు కాదు.. అభివృద్ధిపై బహిరంగ చర్చకు రండి బీఆర్ఎస్ నేతల విమర్శలపై కాంగ్రెస్ మహిళా కౌన్సిలర్ల ధ్వజం
పదేళ్ల పాలనలో మధిరకు ఏం చేశారో చెప్పాలి
భట్టి విక్రమార్క కృషితో మధిరలో అభివృద్ధి పరుగులు
బీఆర్ఎస్ కౌన్సిలర్ అప్పారావు రాజకీయ డైలాగులు మానుకోవాలి
మధిర: మున్సిపల్ చైర్పర్సన్ సామినేని సుజాతపై 19వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ యాన్నంశెట్టి వెంకట అప్పారావు చేసిన ఆరోపణలను అధికార పార్టీ మహిళా కౌన్సిలర్లు తీవ్రంగా ఖండించారు. ఎవరో తెరవెనుక ఉండి రాసిచ్చిన స్క్రిప్టులను పట్టుకుని మీడియా ముందు రాజకీయ డైలాగులు చెప్పడం మానుకోవాలని, నిజంగా ధైర్యం ఉంటే మధిర అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.
పదవులు, అధికారాలు కోల్పోయిన బాధ నుంచి బీఆర్ఎస్ నేతలు ఇంకా బయటపడలేకపోతున్నారని విమర్శించారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు ఇకపై సాగవని స్పష్టం చేశారు. మధిర ప్రజల ముందు వాస్తవాలు ఉంచి మాట్లాడాలని, కేవలం ఆరోపణలు చేయడం ద్వారా రాజకీయ ఉనికిని కాపాడుకోలేరని అన్నారు.
పదవులు పోయిన బాధతోనే దిగజారుడు ఆరోపణలు
కమల్ రాజు గురించి మాట్లాడే అర్హత చైర్పర్సన్కు లేదంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని కౌన్సిలర్లు మండిపడ్డారు. ప్రజలచేత ఎన్నికై, మున్సిపాలిటీ పరిపాలనను ముందుకు తీసుకెళ్తున్న మహిళా చైర్పర్సన్ను ప్రశ్నించే ముందు తమ పదేళ్ల పాలనలో మధిరకు చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.
చైర్పర్సన్ సుజాతను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ అప్పారావు చేసిన వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. తెరవెనుక ఎవరో చెప్పిన మాటలను వల్లెవేస్తూ ప్రెస్మీట్లు పెట్టడం మానుకోవాలని సూచించారు. చైర్పర్సన్కు పరిపాలనపై ఉన్న స్పష్టత, ప్రజా సమస్యలపై ఉన్న అవగాహన చూసి బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు.
మధిరను విస్మరించిన చరిత్ర బీఆర్ఎస్దే
మధిర మున్సిపాలిటీ అభివృద్ధిని గత పాలకులు నిర్లక్ష్యం చేశారని కౌన్సిలర్లు ఆరోపించారు. 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో మధిరకు జరిగిన అభివృద్ధి ఏమిటో ప్రజల ముందే చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రజల అవసరాలు, మౌలిక వసతులు, అభివృద్ధి పనుల కంటే నిధులు, కాంట్రాక్టర్ల బిల్లుల చుట్టూనే గత పాలన సాగిందని ఆరోపించారు. పదేళ్ల పాలనలో మధిరకు చేసిన అభివృద్ధిని చెప్పలేకనే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని అన్నారు.
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్ నేతలు ఆరోపణలకు దిగుతున్నారని విమర్శించారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, రాజకీయ ఆరోపణలకు సరైన సమయంలో ప్రజలే సమాధానం చెబుతారని పేర్కొన్నారు.
భట్టి విక్రమార్క కృషితో మధిరలో నూతన శకం
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కృషితో మధిర నియోజకవర్గంలో అభివృద్ధికి కొత్త ఊపు వచ్చిందని కాంగ్రెస్ మహిళా కౌన్సిలర్లు పేర్కొన్నారు. మధిర నియోజకవర్గానికి పెద్దఎత్తున నిధులు తీసుకొచ్చి వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారని తెలిపారు.
కేవలం శంకుస్థాపనల పేరుతో విమర్శలు చేయడం కాకుండా, మధిరలో జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు. భట్టి విక్రమార్క తీసుకొస్తున్న నిధులతో మధిర రూపురేఖలు మారుతున్నాయని, ఈ వాస్తవాలను బీఆర్ఎస్ నేతలు గుర్తించాలని అన్నారు.
ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే రాజకీయంగా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. చేతకాని విమర్శలతో కాలక్షేపం చేయడం మాని, మధిర అభివృద్ధిపై నిర్మాణాత్మకంగా మాట్లాడాలని హితవు పలికారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు దోర్నాల శిరీష, యర్రందసు చారులత, బోడపూడి రేవతి, గద్దల మాధురి, షేక్ రసుద్దీన్, నగరకంటి రాజేశ్వరి, బొల్లెద్దు విజయలక్ష్మి, రంగ రూప పాల్గొన్నారు.