మధిరలో మహాత్మా గాంధీ శాంతి సేన ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమం
మధిరలో మహాత్మా గాంధీ శాంతి సేన ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమం
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని విద్యార్థులకు పిలుపు
ఖమ్మం జిల్లా, మధిర: మహాత్మా గాంధీ శాంతి సేన ఆధ్వర్యంలో మధిర జూనియర్ కళాశాలలో శనివారం యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మధిర టౌన్ ఎస్సై కిషోర్ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.
యువతే దేశ భవిష్యత్తని, క్షణిక ఆనందం కోసం మత్తు పదార్థాల బారిన పడకుండా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు. డ్రగ్స్కు దూరంగా ఉండి చదువు, క్రీడలు, సేవా కార్యక్రమాలపై దృష్టి సారించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
సీనియర్ నాయకుడు ఎస్. నాగేశ్వరరావు మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు బానిస కాకుండా కుటుంబ విలువలు, సామాజిక బాధ్యతలను గుర్తుంచుకోవాలని అన్నారు. ప్రతి విద్యార్థి తన స్నేహితులను కూడా డ్రగ్స్కు దూరంగా ఉంచే బాధ్యత తీసుకోవాలని కోరారు.
న్యాయవాది సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మత్తు పదార్థాలకు సంబంధించిన నేరాలపై చట్టాలు అత్యంత కఠినంగా ఉన్నాయని తెలిపారు. ఒక తప్పు నిర్ణయం జీవితాంతం ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉందని హెచ్చరిస్తూ, చట్టాలను గౌరవించే బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని సూచించారు.
డాక్టర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ డ్రగ్స్ వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని చెప్పారు. గుండె, మెదడు, కాలేయం వంటి కీలక అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉందని వివరించి, ఆరోగ్యవంతమైన జీవితం కోసం వ్యాయామం, పోషకాహారం, క్రమశిక్షణ అవసరమని తెలిపారు.
జూనియర్ కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ లత మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు మంచి నడవడికను అలవర్చుకోవాలని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సూచనలు పాటిస్తూ ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని కోరారు. మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండి సమాజానికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమం ముగింపులో విద్యార్థులతో "మత్తు పదార్థాలకు దూరంగా ఉంటాం – ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి కృషి చేస్తాం" అనే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు, మహాత్మా గాంధీ శాంతి సేన సభ్యులు పాల్గొన్నారు.