మధిరలో వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం
తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం మధిర పట్టణంలో శ్రావణమాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ పద్మావతి అలివేలుమంగ సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు.
ఆలయంలో వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి శాంతి కళ్యాణాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కళ్యాణ మహోత్సవం అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వేమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు అందించారు.
ఇదిలా ఉండగా గురువారం సాయంత్రం 6 గంటల నుంచి శ్రీ పద్మావతి అలివేలుమంగ సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ విగ్రహాలను మధిర పట్టణంలోని ప్రధాన పురవీధుల్లో అత్యంత వైభవంగా ఊరేగించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఊరేగింపును విజయవంతం చేయాలని వారు కోరారు.