మధ్యాహ్న భోజన పథకం భోజనాలు విద్యార్థులు సంతృప్తికరంగా భుజించాలి
మధ్యాహ్న భోజన పథకం భోజనాలు విద్యార్థులు సంతృప్తికరంగా భుజించాలి నాణ్యతలో చిన్న లోటు ఉన్నా చర్యలు తప్పవు: మంత్రి కొలుసు పార్థసారథి
ఆగిరిపల్లి, మార్చి 25: ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం ఈదర గ్రామంలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో అమలు అవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి బుధవారం అకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేసి ఆహార నాణ్యతను స్వయంగా తనిఖీ చేశారు.
విద్యార్థులతో భోజనం చేస్తూ ఉపాధ్యాయులు పాఠాలు ఎలా బోధిస్తున్నారో, భోజనం నాణ్యత ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. భోజనం పట్ల విద్యార్థులు సంతృప్తిగా ఉన్నారని మంత్రి తెలిపారు.
మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యంగా ఎదగాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ‘డొక్కా సీతమ్మ’ పేరుతో పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నదన్నారు. విద్యార్థులకు పోషకాహారం అందించేందుకు సన్నబియ్యంతో భోజనం అందిస్తున్నామని పేర్కొన్నారు.
ప్రతిరోజూ మధ్యాహ్న భోజన నాణ్యతను ఒక ఉపాధ్యాయుడు తప్పనిసరిగా పరిశీలించాలని ఐటి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని కొనియాడారు. భోజన నాణ్యతలో ఎక్కడైనా లోపాలు ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గత ఐదేళ్లలో నిలిచిపోయిన ఉపాధ్యాయుల భర్తీని కూటమి ప్రభుత్వం మొదటి సంవత్సరంలోనే పూర్తి చేసిందని మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంధిపాము శారద, విద్యా కమిటీ చైర్మన్ కంచిర్ల అంజయ్య, ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు, ఉపాధ్యాయులు, నాన్-టీచింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.