మీకోసం కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలకు చట్ట పరిధిలో పరిష్కారం అందించాలి: కృష్ణా జిల్లా ఎస్పీ
మచిలీపట్నం, జూలై 6: కృష్ణా జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన "మీకోసం" ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల ఫిర్యాదులను జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం పోలీస్ కార్యాలయానికి వచ్చినప్పుడు వారికి ఆత్మీయత, మర్యాద, సహానుభూతితో వ్యవహరించాలని అధికారులకు సూచించారు. ఫిర్యాదుదారుల సమస్యలను చిరునవ్వుతో స్వీకరించి, వారి బాధను ఓర్పుతో వింటే వారు మానసికంగా ఎంతో ఊరట పొందుతారని అన్నారు.
ప్రతి ఫిర్యాదుదారునితో మనస్ఫూర్తిగా మాట్లాడి, వారి సమస్యను పూర్తిగా తెలుసుకుని, చట్ట పరిధిలో న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని నమ్మకం కలిగించాలని ఎస్పీ తెలిపారు. ప్రజలకు పోలీసు శాఖపై విశ్వాసం మరింత పెరిగేలా ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
మీకోసం కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 50 ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించి, వాటిని సంబంధిత అధికారులకు పంపించి చట్ట ప్రకారం విచారణ జరిపి తగిన పరిష్కారం అందిస్తామని హామీ ఇచ్చారు.