మహిళల భద్రత - మత్తు పదార్థాల నిర్మూలనే లక్ష్యం: అన్నమయ్య జిల్లా పోలీసుల వినూత్న ప్రచార హోరు..
అన్నమయ్య జిల్లా మదనపల్లి
పల్లె పల్లెకూ ఆటోలతో ప్రచారం- యువతకు 'డ్రగ్స్ వద్దు బ్రో' అంటూ హితబోధ
సమాజంలో మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, మత్తు పదార్థాలు లేని ఆరోగ్యవంతమైన జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అన్నమయ్య జిల్లా పోలీసులు వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా 'సురక్షిత సమాజం - మనందరి బాధ్యత' అనే నినాదంతో పోలీసులు ప్రజల్లో చైతన్యం నింపుతున్నారు.
పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రతి గల్లీలోనూ ఆటోలకు ప్రత్యేక బ్యానర్లు కట్టి, లౌడ్ స్పీకర్ల ద్వారా నేరాల నివారణపై
అవగాహన కల్పిస్తున్నారు. నేటి యువతను పట్టి పీడిస్తున్న గంజాయి, డ్రగ్స్ వంటి అలవాట్ల వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ "డ్రగ్స్ వద్దు బ్రో" అంటూ యువతకు హితబోధ చేస్తున్నారు. గంజాయి వాడకం కుటుంబాలకు తీరని వేదన మిగిలిస్తుందని హెచ్చరిస్తున్నారు.
ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో 112, 1930, 1972 మరియు 1098 వంటి నంబర్లను సంప్రదించాలని సూచించారు. సీఐలు, ఎస్ఐలు స్వయంగా పాల్గొని ఈ అవగాహన కార్యక్రమాలను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.