నూజివీడులో ఘనంగా వైఎస్సార్ 77వ జయంతి వేడుకలు
ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలోని చిన్నగాందీ బొమ్మ సెంటర్లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూజివీడు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు డాక్టర్ వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి జయంతి వేడుకలను నిర్వహించారు.
ఈ సందర్భంగా మేకా వెంకట ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ, రైతులకు ఉచిత విద్యుత్, పేదలకు ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇళ్ల పథకం, ఫీజు రీయింబర్స్మెంట్, సామాజిక పింఛన్లు, మహిళలకు పావలా వడ్డీ రుణాలు, 108 అంబులెన్స్ సేవలు, జలయజ్ఞం వంటి ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసి కోట్లాది కుటుంబాల్లో ఆశలు నింపిన మహోన్నత ప్రజానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి అని కొనియాడారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగించి, పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడిగా ఆయనను ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని అన్నారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పాల్గొని వైఎస్సార్కు ఘనంగా నివాళులర్పించారు.