కోటపాడులో ఘనంగా వైఎస్సార్ 77వ జయంతి వేడుకలు
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం కోటపాడు గ్రామంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి ఆయన సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి పేదలు, రైతులు, విద్యార్థులు, మహిళల సంక్షేమమే లక్ష్యంగా ఎన్నో ప్రజాహిత పథకాలను అమలు చేసి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత అని కొనియాడారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఉచిత విద్యుత్, జలయజ్ఞం, 108 అంబులెన్స్ వంటి పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపారని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను నేటి తరాలు ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో చెలికాని సందీప్, మోదుగుమూడి మాధవరావు, నాగుల మురళి, నాగుల మారేష్, మల్లేల రాములు, మల్లేల చెన్నారావు, షేక్ నాగవలి తదితర నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు, వైఎస్సార్ అభిమానులు పాల్గొన్నారు.