మొక్కజొన్న రైతుల బకాయిలపై సబ్ కలెక్టర్ సీరియస్ కంపెనీలకు రెండు రోజుల గడువు.. నివేదిక ఇవ్వకపోతే చర్యలు
నూజివీడు, జూలై 29: రబీ 2025–26లో మొక్కజొన్న హైబ్రిడ్ విత్తన ఉత్పత్తికి సంబంధించి రైతుల నుంచి వచ్చిన బకాయిల ఫిర్యాదులపై నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో నూజివీడు నియోజకవర్గంలోని 13 మొక్కజొన్న హైబ్రిడ్ విత్తన కంపెనీల ప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.
సబ్ కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు చెల్లింపులు ఆలస్యం కావడం, బకాయిలు పెండింగ్లో ఉండడం వంటి అంశాలపై తరచూ ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. రైతులు, కంపెనీలు, అధికారుల మధ్య సమన్వయం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
రబీ 2025–26 సీజన్లో నూజివీడు నియోజకవర్గంలో 5,831 మంది రైతులు 12,589 ఎకరాల్లో మొక్కజొన్న హైబ్రిడ్ విత్తన ఉత్పత్తి చేపట్టారని తెలిపారు. బైబ్యాక్ ఒప్పందాల ప్రకారం రైతులకు చెల్లింపులు జరగాల్సి ఉన్నప్పటికీ, కంపెనీలు నియమించిన ఆర్గనైజర్ల కారణంగా పలు ప్రాంతాల్లో రైతులకు సకాలంలో డబ్బులు అందడం లేదని వెల్లడించారు.
ప్రతి కంపెనీ తమ పరిధిలో ఎంతమంది రైతులకు ఎంత మొత్తం బకాయిలు ఉన్నాయో పూర్తి వివరాలతో రెండు రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఆదేశాలను పాటించని కంపెనీలపై సీడ్స్ యాక్ట్–1966తో పాటు సంబంధిత నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రైతులకు చెల్లింపులు చేయాల్సిన పూర్తి బాధ్యత కంపెనీలదేనని, గుర్తింపు లేని మధ్యవర్తులతో ప్రభుత్వం వ్యవహరించదని స్పష్టం చేశారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై జిల్లా కలెక్టర్కు నివేదిక పంపనున్నట్లు తెలిపారు. సమావేశానికి హాజరుకాని కంపెనీలకు కూడా ఇదే ఆదేశాలు జారీ చేస్తామని, వచ్చే 7 నుంచి 10 రోజుల్లో ప్రత్యేక ఫాలోఅప్ నిర్వహించి రైతుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని సబ్ కలెక్టర్ వెల్లడించారు.