మూడు నెలల్లో పెళ్లి.. అంతలోనే విషాదం
మూడు నెలల్లో పెళ్లి.. అంతలోనే విషాదం: గంటల వ్యవధిలో కాబోయే దంపతుల మృతి
కలకాలం కలిసి జీవించాలని కలలు కన్న ఓ యువ జంట విషాదాంతం చెందింది. మరో మూడు నెలల్లో వివాహ బంధంలోకి అడుగుపెట్టాల్సిన ఇద్దరు బ్యాంకు ఉద్యోగులు గంటల వ్యవధిలోనే మృతి చెందిన ఘటన కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
కాసరగోడ్ జిల్లా పూచక్కాడ్కు చెందిన 25 ఏళ్ల పి. అనుశ్రీకి, కన్నూర్ జిల్లా ఇరిట్టికి చెందిన 26 ఏళ్ల వి. అమల్తో ఇటీవల నిశ్చితార్థం జరిగింది. డిసెంబర్లో వివాహం చేసుకోవాలని ఇరు కుటుంబాలు నిర్ణయించుకున్నాయి. ఇద్దరూ ఒకే బ్యాంకులో ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ వేర్వేరు శాఖల్లో విధులు నిర్వహిస్తున్నారు.
అనుశ్రీ కర్ణాటకలోని ఓ బ్యాంకు శాఖలో పనిచేస్తుండగా, అమల్ కేరళలోని ఎర్నాకులం శాఖలో విధులు నిర్వహిస్తున్నాడు. అయితే గురువారం అనుశ్రీ కర్ణాటకలోని హున్సూర్లో ఉన్న నివాసంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించింది. ఇంటి యజమాని సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆమె మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
అనుశ్రీ మరణవార్త తెలుసుకున్న కొద్ది గంటల్లోనే అమల్ కూడా ఎర్నాకులంలోని ఓ హోటల్ గదిలో మృతిచెంది కనిపించాడు. హోటల్ సిబ్బంది సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.
ప్రాథమిక దర్యాప్తులో అమల్ ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించకపోవడంతో ఇతర కోణాల్లోనూ విచారణ కొనసాగిస్తున్నారు. అమల్ మొబైల్ ఫోన్, కాల్ వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
పెళ్లి ఏర్పాట్లలో ఉండాల్సిన సమయంలో కాబోయే భార్యాభర్తలు ఇలా ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. పూర్తి దర్యాప్తు అనంతరం మాత్రమే ఈ ఘటనకు సంబంధించిన అసలు కారణాలు వెలుగులోకి రానున్నాయి.