మోసపూరిత మద్దతు ధరలపై రైతు సంఘం ఆందోళన
మోసపూరిత మద్దతు ధరలపై రైతు సంఘం ఆందోళన
స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని డిమాండ్
నూజివీడు, జూన్ 1: కేంద్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి ప్రకటించిన పంటల కనీస మద్దతు ధరలు (ఎంఎస్పీ) రైతులను తీవ్రంగా నిరాశపరిచాయని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ విమర్శించారు. మద్దతు ధరల పెంపు పేరుతో రైతులను మోసం చేస్తున్నారని ఆరోపిస్తూ సోమవారం నూజివీడులోని చిన గాంధీ బొమ్మ సెంటర్ వద్ద రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రతులను దహనం చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా రైతులు, రైతు సంఘం నాయకులు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను వెంటనే అమలు చేయాలని, రైతులు పండించిన పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, మామిడి రైతులను ఆదుకోవాలని, వ్యవసాయ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని నినాదాలు చేశారు.
కె. శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూర్చే విధానాలను అమలు చేస్తూ రైతుల ప్రయోజనాలను విస్మరిస్తోందని విమర్శించారు. రైతులు పండించే పంటలకు కనీస మద్దతు ధరలు కూడా సమర్థవంతంగా అమలు కావడం లేదన్నారు. 2026-27 సంవత్సరానికి ప్రకటించిన ఎంఎస్పీలు ఉత్పత్తి వ్యయాలకు అనుగుణంగా లేవని పేర్కొన్నారు. మొక్కజొన్నకు కిలోకు కేవలం 10 పైసలు, వరికి 72 పైసలు మాత్రమే పెంచడం రైతులను అవమానించడమేనన్నారు.
ఇదే సమయంలో పెట్రోల్, డీజిల్, ఎరువులు, విత్తనాల ధరలు భారీగా పెరిగాయని, సాగు ఖర్చులు రోజురోజుకు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో రైతులకు గిట్టుబాటు ధరలు లేకపోవడం వ్యవసాయ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తుందని హెచ్చరించారు.
స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు ఉత్పత్తి వ్యయంపై అదనంగా 50 శాతం లాభం కలిపి మద్దతు ధరలను నిర్ణయించాలని, ఎంఎస్పీకి చట్టబద్ధ హామీ కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే నష్టాల్లో ఉన్న మామిడి రైతులకు తక్షణ నష్టపరిహారం చెల్లించాలని కోరారు.
రైతుల ఆందోళనకు సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్. లింగరాజు, జిల్లా ఉపాధ్యక్షుడు జి. రాజు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో చిమట శ్రీనివాసరావు, ఎం. నరేష్, కె. శ్రీనివాసరావు, ఎస్.కే. భాషా, కె. శామ్యూల్, ఆర్. ప్రసాద్, ఎ. వసంతరావు, పి. సోమనాద్రి తదితరులు పాల్గొన్నారు.