మరో కిడ్నీ బాధితురాలు మృతి.. ఏ.కొండూరులో ఆగని మూత్రపిండ వ్యాధి మరణాలు
ఏ.కొండూరు: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని ఏ.కొండూరు మండలంలో మూత్రపిండాల వ్యాధి మరో ప్రాణాన్ని బలిగొంది. కృష్ణారావుపాలెం గ్రామానికి చెందిన విస్సంపల్లి తేరేజమ్మ (65) కొంతకాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ గురువారం ఉదయం మృతి చెందారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. ఆమె కొంతకాలంగా ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ చేయించుకుంటున్నారు.
తేరేజమ్మ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. నిరుపేద కుటుంబానికి చెందిన ఆమెకు ఇద్దరు సంతానం ఉన్నారు. అనారోగ్యానికి చికిత్స అందించేందుకు ఇప్పటివరకు సుమారు రూ.2 లక్షలు ఖర్చు చేసినప్పటికీ తల్లిని కాపాడుకోలేకపోయామని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
రోజురోజుకూ పెరుగుతున్న ఆందోళన
ఏ.కొండూరు మండలంలోని గిరిజన తండాలు, వివిధ గ్రామాల్లో మూత్రపిండాల వ్యాధి సమస్యపై ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. ఇప్పటికే పలువురు బాధితులు మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ డయాలసిస్పై ఆధారపడుతున్నారు. చికిత్స కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి రావడంతో బాధిత కుటుంబాలపై ఆర్థిక, మానసిక భారం పెరుగుతోంది.
ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలి
ఏ.కొండూరు మండలంలో మూత్రపిండాల వ్యాధి సమస్యపై ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక దృష్టి సారించాలని సీపీఎం డిమాండ్ చేసింది. వ్యాధికి కారణాలను గుర్తించేందుకు సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించాలని, బాధితులకు నిరంతర వైద్య సేవలు అందించాలని కోరింది. డయాలసిస్ సేవలను స్థానికంగానే అందుబాటులోకి తీసుకురావడంతో పాటు బాధిత కుటుంబాలకు అవసరమైన వైద్య, ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేసింది.