పెనుగొలనులో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమం
పెనుగొలను: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో గురువారం వీరనారి చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో చాకలి సామాజిక వర్గానికి చెందిన కోటమ్మ, రాణిలను నూతన వస్త్రాలతో సత్కరించి మిఠాయిలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో సేవా కమిటీ అధ్యక్షుడు వూటుకూరు నారాయణరావు మాట్లాడుతూ.. తన భూమిని లాక్కోవాలని ప్రయత్నించిన దొరను ధైర్యంగా ఎదిరించి, తన భూమిపై తనకే హక్కు ఉందని చాటిచెప్పిన వీరనారి చాకలి ఐలమ్మ ఎందరికో ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. తెలంగాణ సాయుధ పోరాటంలో నిజాం, రజాకార్లు, దొరల దోపిడీకి వ్యతిరేకంగా గడ్డపార పట్టి పోరాడిన తొలి వీరనారిగా ఐలమ్మ చరిత్రలో నిలిచిపోయారని పేర్కొన్నారు.
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి, ధైర్యసాహసాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మహిళా కమిటీ సభ్యులు, అంగన్వాడీ సిబ్బంది, చిన్నారులు, తదితరులు పాల్గొన్నారు.