మత్స్య సొసైటీల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయాలి
మత్స్య సొసైటీల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయాలి
మండల, మున్సిపల్ కేంద్రాల్లో చేపల మార్కెట్లు నిర్మించాలి: కలెక్టరేట్ ఎదుట మత్స్యకారుల ధర్నా
మంచిర్యాల: ప్రభుత్వం ఉచిత చేపలు, రొయ్య పిల్లల కొనుగోలు కోసం 100 శాతం సబ్సిడీతో నేరుగా మత్స్య సొసైటీ ఖాతాల్లోనే నగదు జమ చేయాలని, జిల్లాలోని కార్పొరేషన్, మున్సిపాలిటీ, మండల కేంద్రాలలో చేపల మార్కెట్లను నిర్మించాలని తెలంగాణ మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి బోడెంకి చందు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పేరిట టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లు, అధికారులకు మేలు చేయగా, ప్రస్తుత ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో నిధులు కేటాయించకుండా మత్స్యకారులకు తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించారు. పెండింగ్ లో ఉన్న ఇన్సూరెన్స్ క్లెయిమ్లు చెల్లించాలని, కార్పొరేషన్లో రూ. 200 కోట్లతో 10 హోల్సేల్ మార్కెట్లు, మున్సిపాలిటీల్లో రూ. 100 కోట్లతో 100 రిటైల్ మార్కెట్లు నిర్మించాలన్నారు. అలాగే ఎండిపోయిన చెరువుల లీజులు రద్దు చేయాలని, కబ్జాలకు గురికాకుండా చెరువులకు ఫెన్సింగ్ వేయాలని, మత్స్యకారులకు 90 శాతం సబ్సిడీతో ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలను అందించాలని కోరారు.
ఈ నిరసన కార్యక్రమంలో మత్స్యకారుల సంఘం జిల్లా అధ్యక్షులు మంచర్ల రాజేందర్, జిల్లా ఉపాధ్యక్షులు బోయరి రాజకుమార్, జూనియరి నారాయణ, సంఘం నాయకులు గుమ్ముల శ్రీనివాస్, మొగుర్ల మహేష్, మల్లేష్, చంద్రశేఖర్, భూమయ్య, పిడుగు శ్రీనివాస్, సతీష్, రవి, చిలుకయ్య, సిహెచ్ రాజ్ కుమార్, గగ్గూరు రాజన్న, నరేష్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు