మత్తుకు దూరంగా ఉండండి.. భవిష్యత్తును కాపాడుకోండి
మత్తుకు దూరంగా ఉండండి.. భవిష్యత్తును కాపాడుకోండి: తిరుపతి జిల్లా పోలీసులు
తిరుపతి జిల్లా పోలీస్ శాఖ జిల్లా వ్యాప్తంగా గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు పర్యవేక్షణలో "డ్రగ్స్ ఫ్రీ తిరుపతి జిల్లా" లక్ష్యంతో మెగా గంజాయి టెస్టింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
జిల్లాలోని అన్ని సబ్డివిజన్ల పరిధిలో డీఎస్పీల ఆధ్వర్యంలో అనుమానిత ప్రాంతాలు, పరిశ్రమలు, కార్మికుల సమూహాలు తదితర ప్రదేశాల్లో గంజాయి పరీక్షలు నిర్వహిస్తూ వినియోగదారులను గుర్తిస్తున్నారు. పరీక్షల్లో పాజిటివ్గా తేలిన వారికి చట్టపరమైన చర్యలతో పాటు కౌన్సెలింగ్ నిర్వహించి, మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి సబ్డివిజన్ పరిధిలోని తొట్టంబేడు పోలీస్ స్టేషన్ పరిధిలో కజారియా ఫ్యాక్టరీ, వి-ఫార్మ్ పరిశ్రమల కార్మికులకు మెగా గంజాయి టెస్టింగ్ నిర్వహించారు. ఎస్ఐలు, పోలీసు సిబ్బంది సమక్షంలో పరీక్షలు చేపట్టి మత్తు పదార్థాల వినియోగంపై అవగాహన కల్పించారు.
మత్తు పదార్థాల నిర్మూలనలో ప్రజలు, యువత, విద్యాసంస్థలు, పరిశ్రమల యాజమాన్యాలు, తల్లిదండ్రులు సహకరించాలని ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు విజ్ఞప్తి చేశారు. గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై సమాచారం ఉంటే 1972 (ఈగల్) లేదా 112 నంబర్లకు తెలియజేయాలని సూచించారు. ప్రజల భాగస్వామ్యంతోనే "డ్రగ్స్ ఫ్రీ తిరుపతి జిల్లా" లక్ష్యాన్ని సాధించగలమని తెలిపారు.