ముసునూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి: సీపీఐ ఎంఎల్ లిబరేషన్ డిమాండ్
ముసునూరు, ఆగస్టు 31:
ఏలూరు జిల్లా నూజివీడు డివిజన్ పరిధిలోని ముసునూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఎంఎల్ లిబరేషన్, అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం, ఏఐసీసీటీయూ ఆధ్వర్యంలో సోమవారం ముసునూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీఐ ఎంఎల్ లిబరేషన్ మండల కార్యదర్శి వేముల బక్కయ్య మాట్లాడుతూ ముసునూరు మండలంలో కరువు పరిస్థితులు నెలకొన్నందున ప్రభుత్వం వెంటనే కరువు మండలంగా ప్రకటించి రైతులు, వ్యవసాయ కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
బీజేపీ ప్రభుత్వం 11 సంవత్సరాల పాలనలో ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. “మోదీ హటావో.. దేశ్ బచావో.. ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం.. దేశాన్ని కాపాడుకుందాం” అంటూ నినాదాలు చేశారు. బుల్డోజర్ పాలనను అంతం చేయాలని, రాజ్యాంగం, ప్రజల హక్కులను పరిరక్షించాలని కోరారు.
పౌరులందరికీ ఓటు హక్కు పునరుద్ధరించాలని, గ్రామాల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేసి గృహ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500, నిరుద్యోగులకు రూ.3000 భృతి ఇవ్వాలని కోరారు.
నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించి జీవనానికి సరిపడా వేతనాలు అందించాలని అన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించి 200 రోజుల పని దినాలు కల్పించాలని, రోజువారీ కూలి రూ.700 ఇవ్వాలని డిమాండ్ చేశారు.
నిలిపివేసిన ఉపాధి పనులను వెంటనే ప్రారంభించాలని, వీబీ-జీఆర్ఏఎంజీ పథకాన్ని రద్దు చేయాలని కోరారు. అటవీ భూములకు సంబంధించిన నాలుగో నోటిఫికేషన్ను రద్దు చేసి, రమణక్కపేట సాగుదారులతో జాయింట్ కలెక్టర్ సమీక్ష నిర్వహించి పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రమణక్కపేట గ్రామంలో రీ సర్వే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని తెలిపారు.
స్కీమ్ వర్కర్లకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రూ.42 వేల వేతనం అందించాలని, పాఠశాల కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఐసీసీటీయూ సభ్యులు మేకల కుమారి, పల్లెపాము భవాని, జూట్రు కమల, నాగేశ్వరరావు, కొడపాక రామకృష్ణచారి, మాదాసు పుల్లారావు, ఆముదాల సురేష్, కొత్తపల్లి సోమేశ్వరరావు, చింతరాల రాంబాబు, ముష్టిబండ శివశబరీష్ తదితరులు పాల్గొన్నారు.