లింగాల కేదారి కుటుంబానికి మంత్రి పొంగులేటి పరామర్శ
విద్యుత్ ప్రమాదంలో మృతి చెందిన లింగాల కేదారి కుటుంబానికి మంత్రి పొంగులేటి పరామర్శ
వరంగల్, NTODAY న్యూస్: ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో భాగంగా అదాలత్ సర్కిల్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ, రెవెన్యూ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కలిసి ఇటీవల విద్యుత్ ప్రమాదంలో మృతి చెందిన లింగాల కేదారి కుటుంబాన్ని పరామర్శించారు.
ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి విజ్ఞప్తి మేరకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లింగాల కేదారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. విద్యుత్ ప్రమాదంలో కేదారి దంపతులు మృతి చెందిన ఘటనపై కుటుంబ సభ్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వారి కుటుంబ పరిస్థితి, ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా ఉద్యమ కాలంలో లింగాల కేదారి అందించిన సేవలను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కేదారి కుటుంబానికి ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందించాలని మంత్రిని కోరారు.
దీనిపై స్పందించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వం తరఫున కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం కేదారి కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించారు. కుటుంబానికి అవసరమైన సహాయాన్ని అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.