జనసైనికుడి కుటుంబానికి ఎంపీ కేశినేని చిన్ని అండ
జనసైనికుడి కుటుంబానికి ఎంపీ కేశినేని చిన్ని అండ నవజాత శిశువు వైద్యానికి రూ.4.50 లక్షల సీఎంఆర్ఎఫ్ సాయం
తిరువూరు: గంపలగూడెం మండలం వినగడప గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త పెమ్మిరాజు శ్రీనివాస్ దంపతులకు ఇటీవల తక్కువ బరువుతో మగ శిశువు జన్మించాడు. 1.3 కిలోల బరువున్న శిశువుకు విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. వైద్య ఖర్చులు భారీగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని గంపలగూడెం జనసేన మండల అధ్యక్షుడు చింతలపాటి వెంకట కృష్ణారావు, ఉపాధ్యక్షుడు జరబల రామకృష్ణ ద్వారా నియోజకవర్గ సమన్వయకర్త మనుబోలు శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లారు.
ఈ విషయంపై మనుబోలు శ్రీనివాసరావు విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ (చిన్ని)తో ఫోన్లో మాట్లాడారు. స్పందించిన ఎంపీ సీఎంఓ కార్యాలయం ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి తక్షణమే రూ.4.50 లక్షల ఆర్థిక సాయం విడుదలయ్యేలా ప్రత్యేక చొరవ తీసుకున్నారు. శిశువుకు సుమారు నెలరోజుల పాటు అవసరమయ్యే వైద్య ఖర్చుల కోసం రూ.12 లక్షల ఎల్ఓసీకి దరఖాస్తు చేయగా, తొలి విడతగా రూ.4.50 లక్షలు మంజూరయ్యాయి.
మంజూరు పత్రాన్ని ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తన కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త మనుబోలు శ్రీనివాసరావుతో కలిసి శిశువు తండ్రి పెమ్మిరాజు శ్రీనివాస్కు అందజేశారు.
ఈ సందర్భంగా పెమ్మిరాజు శ్రీనివాస్ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను, నియోజకవర్గ సమన్వయకర్త మనుబోలు శ్రీనివాసరావు, గంపలగూడెం మండల అధ్యక్షుడు చింతలపాటి వెంకట కృష్ణారావు, ఉపాధ్యక్షుడు జరబల రామకృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.