నారాయణపురంలో సహకార సంఘం గోదాం ప్రారంభం.. అంతర్గత రోడ్లకు శంకుస్థాపన
1000 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో నిర్మించిన గోదాం ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
బోనకల్లు, ఖమ్మం జిల్లా: రైతుల అభ్యున్నతే లక్ష్యంగా ప్రజా పాలనలో ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
మధిర నియోజకవర్గం బోనకల్లు మండలం నారాయణపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన 1000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన సహకార సంఘం గోదామును ఆదివారం ఉప ముఖ్యమంత్రి ప్రారంభించారు. రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంలో భాగంగా గోదాముల నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.
అనంతరం నారాయణపురం గ్రామంలోని ఎస్సీ కాలనీలో రూ.63 లక్షల వ్యయంతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు కరివేద సుధాకర్ ఆధ్వర్యంలో రైతులు, గ్రామ ప్రజలు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి సహకరిస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు వ్యక్తం చేశారు.