నీట్ పేపర్ లీక్ ఘటనపై సీపీఐ ఆందోళన
ఏలూరు: భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జాతీయ సమితి పిలుపులో భాగంగా ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో సోమవారం ఏలూరు పాత బస్టాండ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. నీట్ పేపర్ లీక్ ఘటనలో మృతి చెందిన విద్యార్థులకు నివాళులర్పిస్తూ, వారి కుటుంబాలకు న్యాయం చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా సీపీఐ ఏలూరు జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, నీట్ పేపర్ లీక్ ఘటనల కారణంగా దేశవ్యాప్తంగా పలువురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని, వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.1 కోటి నష్టపరిహారం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థుల ఆత్మహత్యలకు దారితీసిన పరిస్థితులపై దేశవ్యాప్తంగా విద్యార్థి, యువజన సంఘాలు చేసిన పోరాటం ఫలితంగానే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని పేర్కొన్నారు. అయితే మంత్రి రాజీనామాతో సమస్య ముగియదని, విద్యా వ్యవస్థలో సమూల మార్పులు అవసరమని అన్నారు.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ని రద్దు చేసి, ఉమ్మడి ప్రవేశ పరీక్షా విధానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే జాతీయ విద్యా విధానం–2020ను రద్దు చేసి, పరీక్షల నిర్వహణ బాధ్యతలను రాష్ట్రాలకు అప్పగించాలని కోరారు. విద్యా వ్యవస్థలో మాఫియా కార్యకలాపాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
సీపీఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్ మాట్లాడుతూ, నీట్ పేపర్ లీక్కు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాల్లో పాల్గొన్న విద్యార్థులు, యువజనులకు అభినందనలు తెలిపారు. పేపర్ లీక్ ఘటనల వల్ల మృతి చెందిన విద్యార్థులకు సంతాపం తెలియజేస్తూ నివాళులర్పించారు. విద్యా వ్యవస్థలో పారదర్శకత కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు పరీక్షల నిర్వహణలో పూర్తి అధికారాలు కల్పించాలని కోరారు. ఉద్యమాల్లో పాల్గొన్న విద్యార్థులు, యువజనులపై నమోదు చేసిన కేసులను బేషరతుగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
వాణిజ్యీకరణ, కేంద్రీకరణకు ప్రాధాన్యం ఇచ్చే జాతీయ విద్యా విధానం–2020ను రద్దు చేయకపోతే పేపర్ లీక్ ఘటనలు కొనసాగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని, విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి పరీక్షల నిర్వహణ బాధ్యతలను రాష్ట్రాలకు అప్పగించేలా చర్యలు చేపట్టాలని కోరారు.
సీపీఐ ఏలూరు ఏరియా సహాయ కార్యదర్శి కురెళ్ల వరప్రసాద్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యార్థి, యువజన వ్యతిరేక విధానాలను ప్రజలంతా ఐక్యంగా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏలూరు ఏరియా కార్యవర్గ సభ్యురాలు కొల్లూరి సుధారాణి, మావూరి విజయ, జిల్లా కౌన్సిల్ సభ్యులు భజంత్రీ శ్రీనివాసరావు, ఎం.ఏ. హకీమ్, ఉప్పులూరి లక్ష్మి, ఉప్పులూరి భవాని, బళ్ల కనకదుర్గారావు, ఉప్పులూరి రాజమణి, ఉప్పులూరి జ్యోతి, పంతం సుందరమ్మ, దాసిపల్లి ఎర్రయ్య, కుమార్ బాబు, జుజ్జువరపు సురేంద్ర, అక్కిరెడ్డి పోతరాజు తదితరులు పాల్గొన్నారు.