నీటి సరఫరా పునరుద్ధరించండి.. ఇబ్బందులు తొలగించండి
నీటి సరఫరా పునరుద్ధరించండి.. ఇబ్బందులు తొలగించండి మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్కు 7వ వార్డు కలవగట్టు మహిళల వినతి
ఉయ్యూరు, ఆగస్టు 24:
ఉయ్యూరు పట్టణంలోని 7వ వార్డు కలవగట్టు ప్రాంతంలో నీటి సమస్యపై ముస్లిం మహిళలు మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఇటీవల పట్టణంలో అతిసార వ్యాధి నివారణ చర్యల్లో భాగంగా పైపుల ద్వారా సరఫరా చేసే నీటిని నిలిపివేసి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు.
అయితే తమ ప్రాంతానికి ట్యాంకర్ దూరంగా ఉండటంతో వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మహిళలు తెలిపారు. గత మూడు, నాలుగు రోజులుగా గృహ అవసరాలకు కూడా సరిపడా నీరు అందడం లేదని పేర్కొంటూ గతంలో మాదిరిగానే పైపుల ద్వారా నీటి సరఫరా పునరుద్ధరించాలని కోరారు.
ఈ సందర్భంగా వైవీబీ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఉయ్యూరులోని కొన్ని ప్రాంతాల్లో వాంతులు, విరోచనాలు వంటి అనారోగ్య సమస్యలు నమోదయ్యాయని తెలిపారు. నీరు కలుషితం కావడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయనే అనుమానంతో అధికారులు నీటి సరఫరాను నిలిపివేసి పరీక్షల కోసం నమూనాలను ప్రయోగశాలలకు పంపించారని చెప్పారు.
ప్రజలు తప్పనిసరిగా నీటిని కాచి వడపోసి తాగాలని, పరిశుభ్రత పాటించాలని సూచించారు. ప్రస్తుతం పైపుల ద్వారా వచ్చే నీటిని గృహ అవసరాలకు మాత్రమే వినియోగించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మున్సిపల్ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన మేరకు నీటి సరఫరా చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వేమూరి శ్రీనివాస్, అంజిబాబు, జంపన శ్రీనివాస్, సయ్యద్ అజ్మతుల్లా, రాజులపాటి ఫణి, 7వ వార్డు మాజీ కౌన్సిలర్ వడుపు కార్తీక్, మాజీ కౌన్సిలర్లు బూరెల నరేష్, పల్యాల శ్రీను, ఆదిల్ తదితరులు పాల్గొన్నారు.