రైల్వే ఎకోపార్క్లో మొక్కలు నాటిన ఎన్ఎస్ఎస్ విద్యార్థులు
రైల్వే ఎకోపార్క్లో మొక్కలు నాటిన ఎన్ఎస్ఎస్ విద్యార్థులు
గుంటూరు పచ్చదనం పెంపునకు చేయూత.. 100 మొక్కలు నాటి, 200 మొక్కల సంరక్షణ
గుంటూరు, ఆగస్టు 24:
గుంటూరు జిల్లాలో పచ్చదనం శాతం తక్కువగా ఉన్న నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణకు విద్యార్థులు ముందుకు రావడం అభినందనీయమని చేయూత ఫౌండేషన్ వ్యవస్థాపకులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అన్నారు.
గుంటూరు నగరంలోని రైల్వే ఎకోపార్క్లో కల్లం హరినాథ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ఎన్ఎస్ఎస్ విద్యార్థులు మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 100 కొత్త మొక్కలను నాటి, మరో 200 మొక్కల సంరక్షణ బాధ్యతను చేపట్టారు.
కళాశాల కార్యదర్శి డాక్టర్ ఎం. ఉమాశంకర్ రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ బి.ఎస్.బి. రెడ్డి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ప్రొఫెసర్ డి. శ్రీనివాసులు ఆధ్వర్యంలో 60 మంది విద్యార్థినీ విద్యార్థులు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు, నగరంలో పచ్చదనాన్ని పెంచేందుకు విద్యార్థులు చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. భూతాపం తగ్గించడంలో చెట్లు కీలక పాత్ర పోషిస్తాయని, జీవ వైవిధ్య పరిరక్షణకు వృక్షాలు ఎంతో అవసరమని తెలిపారు.
"మనము చెట్లను కాపాడితే.. ఆ చెట్లు మనలను కాపాడతాయి" అని పేర్కొన్నారు. ప్రపంచ భూభాగంలో సుమారు 31 శాతం గ్రీనరీ ఉందని, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3 లక్షల కోట్ల చెట్లు ఉన్నాయని విద్యార్థులకు వివరించారు. రష్యా, బ్రెజిల్, కెనడా, అమెరికా, చైనా దేశాల్లో పచ్చదనం అధికంగా ఉందన్నారు.
భారత అటవీ సర్వే నివేదిక ప్రకారం దేశంలో సుమారు 20 శాతం గ్రీనరీ ఉండగా, ఆంధ్రప్రదేశ్లో 18 శాతం లోపుగా ఉందని, గుంటూరు జిల్లాలో కేవలం 7 శాతం మాత్రమే ఉండటం ఆందోళనకరమన్నారు.
గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో రైల్వే ఎకోపార్క్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రైల్వే డివిజన్ అధికారులు ఎస్. మంజునాథ్, రామశేషరెడ్డి, రేట్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఓరుగంటి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.