నెమలి వేణుగోపాల స్వామి దేవస్థానానికి రూ.55 వేల విరాళం
గంపలగూడెం: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం నెమలి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న నిత్య అన్నదాన కార్యక్రమానికి శనివారం రూ.55 వేల విరాళం అందింది.
ఏలూరు జిల్లా నూజివీడుకు చెందిన వాస్య ఫార్మసీ మేనేజింగ్ పార్టనర్ జూలూరి వంశీకృష్ణ నిత్య అన్నదాన కార్యక్రమానికి తన వంతు సహాయంగా రూ.55,000లను చెక్కు రూపంలో ఆలయానికి అందజేశారు. భక్తులకు నిరంతరం అన్నదానం నిర్వహించేందుకు దాతలు అందిస్తున్న సహకారం అభినందనీయమని ఆలయ నిర్వాహకులు తెలిపారు.
విరాళం అందజేసిన అనంతరం వంశీకృష్ణ స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పి. శాయాచార్యులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయ సిబ్బంది దాతకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్. సంధ్య, ఆలయ సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు.