నూజివీడు ఎక్సైజ్ అధికారులకు ఉత్తమ సేవా పురస్కారాలు
నూజివీడు ఎక్సైజ్ అధికారులకు ఉత్తమ సేవా పురస్కారాలు
సేవలకు గుర్తింపుగా సీఐ మస్తానయ్యకు అవార్డు.. కానిస్టేబుల్ శివాజీకి ప్రశంసా పత్రం
నూజివీడు: విధి నిర్వహణలో అంకితభావంతో ఉత్తమ సేవలు అందించిన నూజివీడు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సీఐ ఏ మస్తానయ్యకు ప్రతిష్టాత్మక ఉత్తమ సేవా పురస్కారం లభించింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా శనివారం విజయవాడ నగరంలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందజేశారు.
ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ చెముకూరి శ్రీధర్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ చేతుల మీదుగా సీఐ మస్తానయ్య అవార్డును స్వీకరించారు. విధి నిర్వహణలో నిబద్ధత, అక్రమ మద్యం నియంత్రణ, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో చూపిన ప్రతిభకు గుర్తింపుగా ఈ పురస్కారం అందించారు.
అదేవిధంగా నూజివీడు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న శివాజీకి కూడా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రశంసా పత్రం లభించింది. రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి చేతుల మీదుగా శివాజీ ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.
నూజివీడు ఎక్సైజ్ విభాగంలో సీఐ మస్తానయ్య, కానిస్టేబుల్ శివాజీలు ఉత్తమ సేవలకు గుర్తింపు పొందడం పట్ల పలువురు సామాజికవేత్తలు, ప్రజా సంఘాల నాయకులు, ప్రముఖులు అభినందనలు తెలిపారు. ఎక్సైజ్ శాఖకు మంచి పేరు తీసుకువస్తూ ప్రజా భద్రత కోసం చేస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు.