నూజివీడు నియోజకవర్గ రైతుల సమస్యలు పరిష్కరించాలి.....
నూజివీడు నియోజకవర్గ రైతుల సమస్యలు పరిష్కరించాలి.. కేంద్రానికి సీపీఐ ఎంఎల్ లిబరేషన్ డిమాండ్
విస్సన్నపేటలో సమావేశం.. కరువు ప్రాంతంగా ప్రకటించాలని, రైతు రుణాలు రద్దు చేయాలని విజ్ఞప్తి
ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట: నూజివీడు నియోజకవర్గంలోని ముసునూరు మండలంలో భారత ఉపరాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఈ ప్రాంత రైతుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలని సీపీఐ ఎంఎల్ లిబరేషన్ డిమాండ్ చేసింది.
ఎల్ నినో ప్రభావంతో ఏర్పడిన అనావృష్టి పరిస్థితుల కారణంగా రైతులు నాట్లు వేయలేని దుస్థితిలో ఉన్నారని, నూజివీడు ప్రాంతాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించేలా చర్యలు తీసుకోవాలని సీపీఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డి. హరినాథ్ కోరారు. రైతాంగ రుణాలను రద్దు చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.
విస్సన్నపేటలో డి. హరినాథ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు ప్రజా సమస్యలపై తీర్మానాలు చేశారు. చెక్కపల్లిలో అంకుశరావు, సుబ్బరాజు, కృష్ణారావు, కృష్ణవేణి తదితరులు భూదాన బోర్డుకు దానం చేసిన 125 ఎకరాల భూములను అక్రమంగా అనుభవిస్తున్న భూస్వాముల నుంచి స్వాధీనం చేసుకుని అర్హులైన పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
నూజివీడు, తిరువూరు నియోజకవర్గాల్లో 70 సంవత్సరాలుగా పేదలు సాగు చేస్తున్న అటవీ భూములకు సంబంధించి ఇచ్చిన 4వ నోటిఫికేషన్ను రద్దు చేయాలని కోరారు. జిరాంజీ పథకాన్ని రద్దు చేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలని, ఏడాదికి 200 రోజుల పని కల్పించి రోజుకు రూ.700 వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు.
మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీలు, పారిశుద్ధ్య కార్మికులకు పెండింగ్లో ఉన్న వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని, స్కీం వర్కర్లందరికీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రూ.46 వేల వేతనం అందించాలని సమావేశంలో కోరారు.
ఈ సమావేశంలో ఏలూరు జిల్లా కార్యదర్శి దుర్గం పుల్లారావు, ఏఐసీసీటీయూ కార్యదర్శి వేముల బక్కయ్య, ఐఫా నేత పి. కళావతి, మేకల కుమారి, భవాని తదితరులు పాల్గొన్నారు.