నవజాత శిశువు మృతి ఘటనపై సమగ్ర విచారణ
నవజాత శిశువు మృతి ఘటనపై సమగ్ర విచారణ: బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం – కలెక్టర్ వెట్రిసెల్వి
ఏలూరు, జూలై 29: ఈ నెల 23న ఏలూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో నవజాత శిశువు మృతి చెందిన ఘటనపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి హామీ ఇచ్చారు.
బుధవారం రాష్ట్ర వైద్య విద్యా శాఖ డైరెక్టర్ డా. విష్ణువర్ధన్తో కలిసి ఆసుపత్రిని సందర్శించిన కలెక్టర్, మృత శిశువు కుటుంబ సభ్యులను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ శిశువు మృతి చెందిందని బాధిత కుటుంబ సభ్యులు కలెక్టర్, డైరెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేసు షీట్లు, వైద్య రికార్డులను పరిశీలించి పూర్తి స్థాయి విచారణ చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అనంతరం ఆసుపత్రిలోని పలు వార్డులను కలెక్టర్, డైరెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోస్ట్ ఆపరేటివ్ వార్డులో సౌకర్యాలను పరిశీలించి, రోగులతో మాట్లాడి వైద్య సేవలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఆసుపత్రిలో సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, బెడ్ షీట్లు మురికిగా, చిరిగిపోయి ఉండటంపై సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓపీ, ఐపీ కౌంటర్ల వద్ద రోగులు ఎక్కువసేపు వేచి ఉండకుండా వేగంగా నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని, అన్ని విభాగాల హెచ్వోడీలు ఓపీ సమయంలో తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని సూచించారు. పోస్ట్ ఆపరేటివ్ వార్డుకు అవసరమైన వైద్య పరికరాలను కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధులతో సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిరుపేదలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించి ప్రజల సంతృప్తిని పెంచేలా చర్యలు చేపట్టాలని డైరెక్టర్కు సూచించారు.
రాష్ట్ర వైద్య విద్యా శాఖ డైరెక్టర్ డా. విష్ణువర్ధన్ మాట్లాడుతూ, నవజాత శిశువు మృతి ఘటనపై ఇప్పటికే విచారణ ప్రారంభించామని తెలిపారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన డా. అనిల్ను విచారణ అధికారిగా నియమించామని, నివేదిక అందిన వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఏలూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఓపీ, ఐపీ నమోదు రెండింతలు పెరగడంతో పాటు శస్త్రచికిత్సలు కూడా మూడు నుంచి నాలుగు రెట్లు పెరిగాయని తెలిపారు. ఇది ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల విశ్వాసం పెరుగుతున్నదానికి నిదర్శనమని పేర్కొన్నారు. శిశువు మృతి దురదృష్టకర సంఘటన అని, విచారణలో వైద్యుల నిర్లక్ష్యం తేలితే ఎలాంటి ఉపేక్ష లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవల లోపాలు, వైద్యులు లేదా సిబ్బంది నిర్లక్ష్యంపై ఫిర్యాదులు ఉంటే 9849902961 నంబర్కు సమాచారం ఇవ్వాలని డా. విష్ణువర్ధన్ ప్రజలకు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. శ్యామల, డా. శశిధర్, డా. రామయ్య, వివిధ విభాగాల వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.