ఓటు హక్కు పరిరక్షణ కోసం ప్రతి కార్యకర్త బాధ్యతగా పనిచేయాలి: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
మంచిర్యాలలో కాంగ్రెస్ BLAలకు అవగాహన సదస్సు – ఓటర్ల జాబితా సవరణ (SIR)పై ఎంపీ దిశానిర్దేశం
మంచిర్యాల: స్థానిక పద్మావతి గార్డెన్లో ఆదివారం కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లు (BLAలు), ముఖ్య కార్యకర్తలకు నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) అవగాహన సదస్సుకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం పౌరులకు కల్పించిన అత్యంత విలువైన ప్రజాస్వామ్య హక్కు 'ఓటు' అని, దీని పరిరక్షణకు ప్రతి కార్యకర్త బాధ్యతాయుతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ఓటర్ల జాబితా పరిశుద్ధత ఎంతో కీలకమని, అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి గల్లంతు కాకుండా BLAలు అప్రమత్తంగా వ్యవహరించాలని దిశానిర్దేశం చేశారు.
సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా కార్యకర్తలు ప్రతి ఇంటిని సందర్శించి ఓటర్ల వివరాలను పకడ్బందీగా ధృవీకరించాలని, కొత్తగా 18 ఏళ్లు నిండిన యువతను ఓటర్లుగా నమోదు చేయించడంతో పాటు ఫారం-6, 7, 8 ప్రక్రియలపై పూర్తి అవగాహన పెంచుకోవాలని సూచించారు. మరణాలు, వలసలు, చిరునామా మార్పుల వివరాలను సేకరించి ఎన్నికల అధికారులకు సహకరించాలని, ఎక్కడైనా ఉద్దేశపూర్వకంగా అర్హుల పేర్లు తొలగించే ప్రయత్నాలు జరిగితే వెంటనే అడ్డుకోవాలని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, పార్టీ బలోపేతమే లక్ష్యాలుగా క్షేత్రస్థాయిలో పనిచేయాలని ఎంపీ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, మండల అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ, సేవాదళ్, మహిళా కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు