పాఠశాల విద్యార్థులకు భూసార పరిరక్షణపై శిక్షణ
పాఠశాల విద్యార్థులకు భూసార పరిరక్షణపై శిక్షణ
తిరువూరు, జూలై 27: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని తిరువూరు జెడ్పీహెచ్ఎస్, ఏపీఎస్డబ్ల్యూఆర్ పాఠశాలల్లో సోమవారం పాఠశాల స్థాయి భూసార పరిరక్షణ పథకం కింద భూసార పరీక్షా కేంద్రం గొల్లపూడి బృందం విద్యార్థులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించింది.
ఈ సందర్భంగా భూసార పరీక్షా కేంద్రం వ్యవసాయ అధికారిణి మేడా సువర్ణ కుమారి మాట్లాడుతూ, విద్యార్థులు నేల ఆరోగ్యం, స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలపై అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ పథకం ద్వారా ప్రతి పాఠశాలలో ప్రభుత్వం మినీ సాయిల్ ల్యాబొరేటరీని ఏర్పాటు చేస్తోందని తెలిపారు. విద్యార్థులు రైతుల పొలాల నుంచి మట్టి నమూనాలను సేకరించి విశ్లేషణ చేసి, నేలలోని పోషకాల స్థాయిని రైతులకు వివరించి, అవసరమైన ఎరువుల వినియోగంపై సూచనలు అందించాలని చెప్పారు.
భూసార పరీక్షా కేంద్ర వ్యవసాయ అధికారి ప్రియాంక మట్టి నమూనాల సేకరణ విధానం, సాయిల్ హెల్త్ కార్డ్ యాప్ వినియోగంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి సురేష్, మండల వ్యవసాయ అధికారిణి పి. పద్మ, ప్రధానోపాధ్యాయులు బి. మృదుల, ఎస్. రవిబాబు, విస్తరణ అధికారి సురేష్, కావ్య సింధు, రైతు సేవా కేంద్ర సహాయకురాలు భాగ్యలక్ష్మి, ఉపాధ్యాయులు ధనలక్ష్మి, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.