పేదల ఇంటికే పింఛన్లు.. ఏపీలోనే అత్యధిక సామాజిక భద్రత
పేదల ఇంటికే పింఛన్లు.. ఏపీలోనే అత్యధిక సామాజిక భద్రత: మంత్రి పార్థసారథి
ఏలూరు/నూజివీడు, జూన్ 1: దేశంలో అత్యధికంగా సామాజిక పింఛన్లు అందిస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఒకే రోజు పింఛన్ల పెంపు నిర్ణయం తీసుకోవడం చారిత్రాత్మకమని పేర్కొన్నారు.
నూజివీడు మండలం పోలసానిపల్లి గ్రామంలో సోమవారం నిర్వహించిన ‘పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా’ కార్యక్రమంలో మంత్రి ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, మహిళలు మంత్రికి ఘన స్వాగతం పలికారు.
మంత్రి మాట్లాడుతూ జిల్లాలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల కింద 2,55,816 మంది లబ్ధిదారులకు జూన్ నెలకు రూ.113.29 కోట్లు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నికల హామీల మేరకు వృద్ధులు, వితంతువుల పింఛన్లను రూ.3 వేల నుంచి రూ.4 వేలకు, దివ్యాంగుల పింఛన్లను రూ.3 వేల నుంచి రూ.6 వేలకు, మంచానికే పరిమితమైన వారికి రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు పెంచి అందిస్తున్నామని తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో పింఛన్ల పెంపునకు సంవత్సరాలు పట్టిందని విమర్శించిన మంత్రి, కూటమి ప్రభుత్వం మాత్రం ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పేదల ముఖాల్లో చిరునవ్వులు చూడటమే తమ ప్రభుత్వానికి అతిపెద్ద సంతృప్తి అని చెప్పారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సవాళ్లతో ఉన్నప్పటికీ, ప్రజలకు మేలు చేయాలనే సంకల్పంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పింఛన్ల పంపిణీలో పాల్గొనడం ప్రజల పట్ల ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమన్నారు.
కార్యక్రమంలో ఏపీ అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎంపీడీవో బి. సాంబశివరావు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, పింఛన్ లబ్ధిదారులు, స్థానికులు పాల్గొన్నారు.