పచ్చిరొట్ట ఎరువులతో భూమి సారాన్ని పెంచాలి
పచ్చిరొట్ట ఎరువులతో భూమి సారాన్ని పెంచాలి
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలోని రైతులు వరి, మొక్కజొన్న పంటల కోతల అనంతరం పచ్చిరొట్ట ఎరువుల సాగు చేపట్టి భూమిని సారవంతం చేయాలని మండల వ్యవసాయాధికారి బి. శివశంకర్ సూచించారు. జీలుగ, జనుము, పిల్లి పెసర వంటి పచ్చిరొట్ట పంటలను సాగు చేయడం ద్వారా భూమిలో నత్రజని స్థాపితం అవుతుందని తెలిపారు. నవధాన్యాల సాగు విధానంలో లెగ్యుమినేసి జాతి మొక్కలు భూమి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు.
ఈ పంటలను పూత దశలో కలియదున్నడం వల్ల నెల రోజుల్లోనే సేంద్రియ కర్బన పదార్థం పెరిగి, భూమిలో సూక్ష్మజీవుల వృద్ధి రేటు అధికమవుతుందని వివరించారు. దీంతో భూమి సారం పెరిగి తదుపరి పంటలకు అధిక దిగుబడులు లభించే అవకాశం ఉంటుందని తెలిపారు.
ప్రస్తుతం మండలంలోని 13 రైతు సేవ కేంద్రాలలో 296 క్వింటాళ్ల జీలుగ, 54 క్వింటాళ్ల జనుము, 33 క్వింటాళ్ల పిల్లి పెసర విత్తనాలను రైతులకు 50 శాతం రాయితీపై అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. రైతులు పచ్చిరొట్ట సాగు చేపట్టి భూతల్లిని కాపాడుకోవడంతో పాటు ప్రకృతి వ్యవసాయంపై మక్కువ చూపాలని కోరారు.
ఈ సందర్భంగా చాట్రాయి రైతు సేవ కేంద్రం వద్ద రైతులకు పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలను 50 శాతం రాయితీపై పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బసవారెడ్డి, జగన్ లు మాట్లాడుతూ పచ్చిరొట్ట ఎరువుల సాగు వల్ల భూమి సారం పెరిగి రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ రైతులు పాల్గొన్నారు.