పడిపోయిన టమాటా ధరలు.. కేజీ రూ.7
ఆంధ్రప్రదేశ్లో టమాటా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలోని ప్రముఖ టమాటా మార్కెట్ అయిన మదనపల్లెలో ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. గ్రేడ్-2 టమాటాల 10 కిలోల బాక్స్ కేవలం రూ.70కే విక్రయమవుతుండటంతో కిలో ధర రూ.7కు పడిపోయింది.
అయితే, మార్కెట్లో నమోదవుతున్న ధర కంటే తమకు ఇంకా తక్కువే దక్కుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిలోకు రూ.3 నుంచి రూ.4.50 మాత్రమే లభిస్తోందని చెబుతున్నారు. సాగు ఖర్చులు, రవాణా వ్యయాలు పెరిగిన పరిస్థితుల్లో ఈ ధరలతో తీవ్ర నష్టాలు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎకరాకు రూ.3 నుంచి రూ.4 లక్షల వరకు పెట్టుబడి పెట్టి టమాటా సాగు చేసినప్పటికీ, గిట్టుబాటు ధర లేకపోవడంతో పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రావడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు రైతులకు అవసరమైన సహాయం అందించాలని వారు కోరుతున్నారు.