పదవ తరగతిలో ప్రతిభ చూపిన విద్యార్థికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం ఘన సన్మానం
NTODAY NEWS నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్ద కాపర్తి గ్రామానికి చెందిన విద్యార్థి బత్తుల శశాంక్ పదవ తరగతి ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో చదువుకున్న శశాంక్, 10వ తరగతిలో ఫలితాలలో 561 మార్కులు సాధించి పాఠశాల స్థాయిలోనే కాకుండా గ్రామ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా నకిరేకల్ శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ వేముల వీరేశం విద్యార్థిని ప్రత్యేకంగా అభినందించారు. శశాంక్ సాధించిన విజయానికి గుర్తింపుగా ఆయన చేతుల మీదుగా మెమెంటో అందజేసి, విద్యార్థిని మరియు వారి తండ్రి బత్తుల చిన్న మల్లయ్యను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వేముల వీరేశం మాట్లాడుతూ విద్యార్థుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. మధ్యాహ్న భోజనంతో పాటు విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని విటమిన్లతో కూడిన స్నాక్స్ మరియు రాగిజావను ప్రభుత్వం అందిస్తోందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కాటం వెంకటేశం, మండల విద్యాధికారి సైదా నాయక్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థి తల్లిదండ్రులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి మంచి మార్కులు సాధించిన శశాంక్ను గ్రామస్తులందరూ అభినందనలతో ముంచెత్తారు.