పీడీఎస్ రేషన్ బియ్యం అక్రమ రవాణాపై అధికారుల కఠిన హెచ్చరిక
పీడీఎస్ రేషన్ బియ్యం అక్రమ రవాణాపై అధికారుల కఠిన హెచ్చరిక
చింతలపూడి మండలంలో పీడీఎస్ రేషన్ బియ్యం అక్రమ రవాణా, నిల్వలు మరియు బ్లాక్ మార్కెట్ విక్రయాలను అరికట్టేందుకు అధికారులు కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాలు, జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత ఆర్ సూచనల మేరకు చింతలపూడి ఎమ్మార్వో కార్యాలయంలో రేషన్ డీలర్లతో అవగాహన సదస్సు, సమీక్షా సమావేశం నిర్వహించారు.
సమావేశంలో చింతలపూడి ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్, తహసీల్దార్ కె. చల్లన్న దొర, సివిల్ సప్లైస్ ఆర్ఐ పి. శ్రీనివాసరావు, ఎస్ఐ సతీష్ కుమార్ పాల్గొని డీలర్లకు కీలక సూచనలు జారీ చేశారు.
అధికారులు మాట్లాడుతూ, ప్రభుత్వం పేదలకు అందిస్తున్న రేషన్ బియ్యాన్ని కొందరు అక్రమంగా కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తూ అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలను ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు.
రేషన్ డీలర్లు అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే నిబంధనల ప్రకారం బియ్యం పంపిణీ చేయాలని, ఎలాంటి అవకతవకలకు పాల్పడినా క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు డీలర్షిప్ రద్దు చేస్తామని హెచ్చరించారు.
రేషన్ బియ్యం అక్రమ నిల్వలు, రవాణాపై పోలీసు మరియు రెవెన్యూ శాఖలు సంయుక్తంగా నిరంతర తనిఖీలు నిర్వహిస్తాయని ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్ తెలిపారు. గతంలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా కేసుల్లో పట్టుబడిన పాత నేరస్తులపై కూడా ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నట్లు చెప్పారు.
ఈ సందర్భంగా పాత ముద్దాయిలను తహసీల్దార్ సమక్షంలో పిలిపించి, భవిష్యత్తులో మళ్లీ అక్రమ కార్యకలాపాలకు పాల్పడకుండా చట్టప్రకారం బైండ్ ఓవర్ చేశారు. తిరిగి నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలతో పాటు కఠిన జైలు శిక్షలు తప్పవని హెచ్చరించారు.
ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి రేషన్ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్కు తరలించే వారి సమాచారాన్ని వెంటనే పోలీసులకు లేదా రెవెన్యూ అధికారులకు అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.