పీఎండీఎస్ కిట్ల పంపిణీ.. తక్కువ నీటితో పంట సాగుపై అవగాహన
పీఎండీఎస్ కిట్ల పంపిణీ.. తక్కువ నీటితో పంట సాగుపై అవగాహన
ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం చండ్రుపట్ల గ్రామంలో వ్యవసాయ శాఖ, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది కలిసి రైతులకు పీఎండీఎస్ కిట్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఏడీఏ కే శశికళ మాట్లాడుతూ పీఎండీఎస్ అంటే రుతుపవనాలకు ముందు చేసే పొడి విత్తనాల సాగు విధానమని తెలిపారు. పొడి నేలలో 20 నుంచి 40 రకాల దేశీయ విత్తనాలను కలిపి విత్తుతారని, వర్షం పడిన వెంటనే ఆ విత్తనాలు మొలకెత్తుతాయని వివరించారు.
ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు బలహీనపడే అవకాశం ఉందని, సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షాలు నమోదయ్యే పరిస్థితి ఉందని తెలిపారు. ముఖ్యంగా ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వర్షపాతం మరింత తగ్గే అవకాశముందని వాతావరణ శాఖ సూచిస్తున్న నేపథ్యంలో రైతులు అందుబాటులో ఉన్న నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు.
నారుమడి విధానానికి బదులుగా వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేయాలని రైతులకు సూచించారు. అలాగే తక్కువ కాలపరిమితి వంగడాలైన ఎంటీయూ 1224, ఎంటీయూ 1282తో పాటు మధ్యస్థ కాలపరిమితి వంగడాలైన బీపీటీ 5204, ఎంటీయూ 1262, ఎంటీయూ 1318 సాగు చేసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి రాజ్యలక్ష్మీ, ఏఈఓ ఉషారాణి, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది శ్రీనివాసరావు, నాగలక్ష్మి, రైతు సేవా కేంద్ర సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.