పెళ్లి వేడుకకు వెళ్లి తిరిగి వస్తుండగా విషాదం.. కాలువలోకి దూసుకెళ్లిన కారు.. నలుగురు యువకులు గల్లంతు
పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి వేడుకకు వెళ్లి తిరిగి వస్తున్న కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లడంతో నలుగురు యువకులు గల్లంతయ్యారు. మరో యువకుడు సురక్షితంగా బయటపడ్డాడు.
ఇరగవరం మండలం అయితంపూడి లాకుల వద్ద ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఓగిడి గ్రామానికి చెందిన ఐదుగురు యువకులు పెరవలిలో జరిగిన వివాహ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా కారు ఒక్కసారిగా అదుపు తప్పి కాలువలోకి పడిపోయింది.
ప్రమాద సమయంలో ఒక యువకుడు కారులో నుంచి బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకోగా, మిగిలిన నలుగురు కారుతో పాటు నీటిలో చిక్కుకుని గల్లంతయ్యారు.
గల్లంతైన వారిని పోతుల లక్ష్మీ భాను (18), రాజారామ్ (17), నాగిరెడ్డి దుశ్వంత్ (18), సాయి సూర్య (19)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
గజ ఈతగాళ్ల సహాయంతో కాలువలో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో ఓగిడి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృత్యువు ఎప్పుడు, ఏ రూపంలో వస్తుందో తెలియదని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది.