పెనుగొలను అంగన్వాడీలో వనజీవి రామయ్య జయంతి వేడుకలు
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను అంగన్వాడీలో బుధవారం పద్మశ్రీ పురస్కార గ్రహీత దరిపల్లి రామయ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం నిర్వహించిన సభలో శిరిడి సాయిబాబా సేవా కమిటీ అధ్యక్షులు వూటుకూరు నారాయణరావు మాట్లాడుతూ, వనజీవి రామయ్య జీవితాంతం పర్యావరణ పరిరక్షణకు అంకితభావంతో పనిచేశారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని రోడ్ల పక్కన, ఆలయాల్లో, ఖాళీ స్థలాల్లో ప్రతిరోజూ మొక్కలు నాటి పచ్చదన పరిరక్షణకు విశేష కృషి చేశారని పేర్కొన్నారు.
కోటికి పైగా మొక్కలు నాటి పర్యావరణ సేవలో అరుదైన రికార్డు సృష్టించిన మహనీయుడిగా వనజీవి రామయ్య నిలిచిపోయారని కొనియాడారు. ఆయన చేసిన సేవలు, నాటిన చెట్లు తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు.
వనజీవి రామయ్య జీవిత చరిత్ర, పర్యావరణ పరిరక్షణకు ఆయన చేసిన కృషిని తెలంగాణ ప్రభుత్వం 6వ తరగతి సాంఘిక శాస్త్ర పాఠ్యాంశంలో, మహారాష్ట్ర ప్రభుత్వం 9వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో చేర్చడం ఆయన సేవలకు దక్కిన గౌరవమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది, స్థానిక మహిళలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.