పెనుగొలను గ్రామంలో పలుచోట్ల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
పెనుగొలను గ్రామంలో పలుచోట్ల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
ఎన్టీఆర్ జిల్లా, గంపలగూడెం:
తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని కోట మార్కండేయ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో పాఠశాల పేరెంట్స్ కమిటీ అధ్యక్షులు ఆదూరి ఆంజనేయులు జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం లభించిందని తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి విద్యారంగంతో పాటు అన్ని రంగాల్లో దేశం గణనీయమైన అభివృద్ధి సాధించిందని వివరించారు.
వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు, 2025-26 విద్యా సంవత్సరంలో పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు దాతలు, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.
గంపలగూడెం మండలం పెనుగొలను 98వ అంగన్వాడీ కేంద్రంలో కూడా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అంగన్వాడీ టీచర్ బి. నాగమణి జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా శిరిడి సాయిబాబా కమిటీ సభ్యులు, దాత కుందా కోటేశ్వరరావు అందజేసిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటాలను 30 మందికి పంపిణీ చేశారు.
మరో కార్యక్రమంలో 98వ అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ టీచర్ కే. లింగమ్మ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించగా, విశ్రాంత బ్యాంకు మేనేజర్ దేవరపల్లి రమేష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
పెనుగొలను ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు కొర్రపాటి యోహను ఆధ్వర్యంలో, ప్రాథమిక సహకార సంఘంలో సంఘ సెక్రటరీ నామా నరసింహారావు ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో గ్రామ ప్రముఖులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.