పెనుగొలను పాఠశాలలో ఘనంగా మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు నివాళి
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలోని ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో సోమవారం మాజీ రాష్ట్రపతి, భారత క్షిపణి పితామహుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొర్రపాటి యోహాను మాట్లాడుతూ అబ్దుల్ కలాం 1931 అక్టోబర్ 15న తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో జన్మించారని తెలిపారు. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ), భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో కీలక బాధ్యతలు నిర్వహించి, భారత రక్షణ రంగాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన మహనీయుడిగా చరిత్రలో నిలిచిపోయారని కొనియాడారు.
విశ్రాంత ప్రిన్సిపాల్ వెదురు వెంకటరెడ్డి మాట్లాడుతూ అబ్దుల్ కలాం 2002 నుంచి 2007 వరకు భారత 11వ రాష్ట్రపతిగా సేవలందించారని, ప్రజలతో మమేకమైన నాయకుడిగా ఆయనను "పీపుల్స్ ప్రెసిడెంట్"గా గుర్తించారని తెలిపారు. విద్యావేత్తగా అనేక మంది విద్యార్థులకు స్ఫూర్తినిచ్చి, ఉన్నత లక్ష్యాలను సాధించేలా ప్రోత్సహించారని పేర్కొన్నారు.
కాన్వెంట్ ప్రిన్సిపల్ తోట నాగరాజు మాట్లాడుతూ ప్రతి ఏడాది అక్టోబర్ 15ను ప్రపంచ విద్యార్థి దినోత్సవంగా నిర్వహించడం అబ్దుల్ కలాంకు ప్రపంచవ్యాప్తంగా లభించిన అత్యున్నత గౌరవానికి నిదర్శనమని అన్నారు.
ఈ కార్యక్రమంలో సాయిబాబా కమిటీ అధ్యక్షుడు వూటుకూరు నారాయణరావు, ఉపాధ్యాయులు కే. సుజాత, ఎం. మాణిక్యం, జి. అలేఖ్య, డి. బేబీ, విద్యార్థులు పాల్గొన్నారు.