పెనుగొలను: స్వాతంత్ర్య సమరయోధుడు జితేంద్రనాథ్ దాస్ వర్ధంతి వేడుకలు
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో ఆదివారం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధుడు, అమరవీరుడు జితేంద్రనాథ్ దాస్ 97వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో వక్తలు మాట్లాడుతూ జితేంద్రనాథ్ దాస్ 1904 అక్టోబర్ 27న జన్మించారని తెలిపారు. 17 ఏళ్ల వయసులోనే మహాత్మా గాంధీ చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారని పేర్కొన్నారు. అనంతరం అనుశీలన్ సమితి, హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్లో చేరి భగత్సింగ్కు సన్నిహితుడిగా మారారని వివరించారు.
బ్రిటిష్ ప్రభుత్వం లాహోర్ కుట్ర కేసులో భాగంగా 1929 జూన్ 14న జితేంద్రనాథ్ దాస్ను అరెస్టు చేసి లాహోర్ జైలులో నిర్బంధించిందని తెలిపారు. బ్రిటిష్ జైళ్లలో రాజకీయ ఖైదీల పట్ల జరుగుతున్న అమానుష ప్రవర్తనను నిరసిస్తూ 1929 జూలై 13న ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారని పేర్కొన్నారు. 63 రోజుల పాటు కఠోర నిరాహార దీక్ష కొనసాగించిన ఆయన 1929 సెప్టెంబర్ 13న కేవలం 24 ఏళ్ల వయసులోనే దేశం కోసం ప్రాణత్యాగం చేసి అమరుడయ్యారని కొనియాడారు.
జితేంద్రనాథ్ దాస్ అంత్యక్రియలకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలో ఐదు లక్షలకు పైగా ప్రజలు హాజరై ఘనంగా నివాళులర్పించిన ఘటన చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయిందని వక్తలు తెలిపారు. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలను అర్పించిన జితేంద్రనాథ్ దాస్ త్యాగం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న ఎంతోమందికి ఆయన ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో సాయిబాబా యూత్ కమిటీ అధ్యక్షుడు వూటుకూరు యజ్ఞకృష్ణ, ముక్కెర జనార్దన్ రెడ్డి, బాణాల సతీష్, కుంచం చిన్నవీరాస్వామి, లేళ్ల సత్యనారాయణ, యర్రమల నాగిరెడ్డి, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.