పెనుగొలనులో భాషావేత్త చిలుకూరి నారాయణరావు 137వ జయంతి వేడుకలు
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో ప్రముఖ భాషావేత్త, చరిత్రకారుడు చిలుకూరి నారాయణరావు 137వ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో చిలుకూరి నారాయణరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో డాక్టర్ జి. నరసింహారావు మాట్లాడుతూ చిలుకూరి నారాయణరావు 1889 ఆగస్టు 9న విశాఖపట్నం జిల్లా పొందూరు సమీపంలోని ఆనందపురంలో భీమాచారి, లక్ష్మమ్మ దంపతులకు జన్మించారని తెలిపారు. తెలుగు భాష, సాహిత్యం, చరిత్ర రంగాల్లో ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. మద్రాస్ విశ్వవిద్యాలయంలో 1930 ఫిబ్రవరి 6న తెలుగు సాహిత్యంలో తొలిసారిగా పీహెచ్డీ పొందిన పండితుల్లో చిలుకూరి నారాయణరావు ప్రముఖులని వివరించారు.
తెలుగు భాషా చరిత్ర, సాహిత్య పరిశోధన, జానపద సాహిత్యం తదితర రంగాల్లో ఆయన విశేష కృషి చేశారని నరసింహారావు తెలిపారు. అశోకుని ధర్మశాస్త్రములు, పదకొండో శతాబ్దం నాటి తెలుగు భాష, ఆంధ్రదేశపు జానపద గేయాలు, ఆంధ్ర భాషా చరిత్రము, తెలుగు పదకోశం, అశోక చక్రవర్తి ధర్మశాసనములు తదితర అనేక రచనలు చేశారని కొనియాడారు. సుమారు 240 గ్రంథాలను రచించి తెలుగు సాహిత్యానికి విశేష సేవలందించారని తెలిపారు.
సాయిబాబా సేవా కమిటీ కార్యదర్శి సుగ్గల హనుమంతరావు మాట్లాడుతూ చిలుకూరి నారాయణరావు నవ్య సాహిత్య పరిషత్ తొలి అధ్యక్షుడిగా, శ్రీకృష్ణదేవరాయ విద్యా పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా సేవలందించారని తెలిపారు. తెలుగు భాషా వికాసానికి, సాహిత్య పరిశోధనకు ఆయన చేసిన కృషి తరతరాలకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని తెలుగులోకి అనువదించిన తొలి వ్యక్తిగా కూడా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉందని తెలిపారు.
చిలుకూరి నారాయణరావు ప్రతిభను గుర్తించిన ఆంధ్ర విశ్వకళా పరిషత్ ఆయనకు ‘కళాప్రపూర్ణ’ బిరుదును, కాశీ సంస్కృత విద్యాపీఠం ‘మహోపాధ్యాయ’ బిరుదును ప్రదానం చేసినట్లు హనుమంతరావు వివరించారు. తెలుగు భాషా సాహిత్య రంగానికి ఆయన అందించిన సేవలను నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో రాళ్లచర్ల జగన్నాథం, సుగ్గల విష్ణు, పాశం వెంకటేశ్వర్లు, కొత్తూరు శ్రీధర్, రంగు సత్యనారాయణ, పారేపల్లి కృష్ణారావు, పసుమర్తి లక్ష్మణరావు, కంభంపాటి గుప్తా తదితరులు పాల్గొన్నారు.