పెనుగొలనులో ఘనంగా జాతీయ పతాక స్వీకరణ దినోత్సవం
పెనుగొలనులో ఘనంగా జాతీయ పతాక స్వీకరణ దినోత్సవం
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో బుధవారం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో జాతీయ పతాక స్వీకరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, సాయిబాబా సేవా కమిటీ సభ్యులు చేతుల్లో జాతీయ జెండాలతో గ్రామంలో ర్యాలీ నిర్వహించి దేశభక్తిని చాటారు. అనంతరం జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ప్రగతి కాన్వెంట్ కరస్పాండెంట్ వెదురు వెంకటరెడ్డి మాట్లాడుతూ, స్వాతంత్ర్య సమర కాలంలో మహాత్మా గాంధీ విజయవాడకు వచ్చిన సందర్భంగా భారతదేశానికి ప్రత్యేక జాతీయ జెండా అవసరాన్ని పింగళి వెంకయ్య తొలిసారిగా ప్రస్తావించారని తెలిపారు. గాంధీ సూచనల మేరకు వెంకయ్య రూపొందించిన జెండాకు స్వల్ప మార్పులు చేసి, 1947 జూలై 22న రాజ్యాంగ సభ త్రివర్ణ పతాకాన్ని అధికారిక జాతీయ జెండాగా ఆమోదించిందని వివరించారు.
ప్రగతి కాన్వెంట్ ప్రిన్సిపాల్ బి. వీరయ్య మాట్లాడుతూ జాతీయ పతాకంలోని కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులు, అశోక చక్రం సూచించే విలువలు, వాటి విశిష్టతను విద్యార్థులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు టీ. నాగరాజు, ఎస్. రాంబాబు, టి. నాగశ్రీ, ఎస్. మౌనిక, బి. దేవమణి, డి. మమత, విద్యార్థులు, సాయిబాబా సేవా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.